ఫండ్ మేనేజర్ల పనేంటంటే.. ఎప్పటికప్పుడు సెన్సెక్స్, నిఫ్టీ రిటర్న్స్తో పోలిస్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకోవడమే. అందుకే మార్కెట్ పడినప్పుడల్లా మంచి వేల్యూ పిక్స్ కోసం వేటాడుతూ ఉంటారు. క్వాలిటీ ఉన్న స్టాక్స్ను ఏరికోరి వెతికి పట్టుకుని అవి పడినప్పుడల్లా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఏస్ ఈక్విటీ సంస్థ డేటా పరిశీలిస్తే గత నాలుగు క్వార్టర్లలో వివిధ ఫండ్ మేనేజర్లు 168 స్టాక్స్లో తమ వాటాలను పెంచుకున్నారు.
వాస్తవానికి సెన్సెక్స్ రికార్డుల దిశగా దూసుకుపోతున్నా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు మాత్రం ఇంకా 20 శాతానికి పైగా నష్టాలతోనే కొనసాగుతున్నాయి. అందుకే వీటిపై ఫండ్ మేనేజర్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.
తాజా డేటా ప్రకారం గార్డెన్ రీచ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, బీఈఎంఎల్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యునిలివర్, ఫైజర్, ఐసిఐసిఐ బ్యాంక్, వోల్టాస్, యాక్సిస్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఎల్ అండ్ టి, ఏసిసి, టోరెంట్ పవర్ వంటి సంస్థలు ఉన్నాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చు
ఫండ్ మేనేజర్లను.. సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు అంత ఈజీగా ఫాలో కావడం కష్టమైన పని. ఎందుకంటే వాళ్లు బల్క్ బయింగ్ చేస్తారు, అవసరమైతే ఎక్కువ కాలం నిరీక్షించగలరు, మరీ అవసరమైతే సదరు స్టాక్స్ భారీగా పతనమైనప్పుడు వాటిని యావరేజ్ చేసుకోగలరు లేదా పూర్తిగా నష్టంతో అయినా వదిలించేసుకోగలరు కూడా. అయితే రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర అంత ఓపిక, డబ్బు ఉండడం కష్టమైన పని. అందుకే వీటిని గుడ్డిగా ఫాలో కావడం సరైంది కాదు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా స్టాక్స్ను ఎంపిక చేశాయంటే వాటిని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాయి. అందుకే వీటిల్లో పెట్టుబడి పెట్టే ముందు మీ రిస్క్ ప్రొఫైల్ను అంచనా వేసుకుని, అవసరమైతే మీ అడ్వైజర్ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.