ముందురోజు ఊగిసలాట మధ్య నష్టాలతో నిలిచినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్ ఏకంగా క్వాడ్రపుల్ను సాధించింది. నిఫ్టీ సైతం సెంచరీ చేయడం విశేషం! ప్రస్తుతం సెన్సెక్స్ 405 పాయింట్లు దూసుకెళ్లి 34,704కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 133 పాయింట్లు జంప్చేసి 10,434 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా వాణిజ్య వివాదాల కారణంగా గ్లోబల్ గ్రోత్ మందగించవచ్చంటూ ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేసిన నేపథ్యంలో మంగళవారం అమెరికా మార్కెట్లు డీలాపడగా.. యూరోపియన్ మార్కెట్లు లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.
ఐటీ వీక్
ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ఐటీ స్వల్పంగా 0.3 శాతం నీరసించింది.. ఆటో, బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ, ఫార్మా రంగాలు 2 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, మారుతీ, ఐషర్, వేదాంతా, జీ, యాక్సిస్, బజాజ్ ఆటో, యూపీఎల్ 8-3 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, విప్రో, హెచ్యూఎల్ 1.7-0.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి.
డెరివేటివ్స్ తీరు
ఎఫ్అండ్వో స్టాక్స్లో దివాన్ హౌసింగ్, శ్రీరామ్ ట్రాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, శ్రేఈ ఇన్ఫ్రా, నాల్కో, పిరమల్, రెప్కో హోమ్, చోళమండలం ఫైనాన్స్ 10.6-7.4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క కావేరీ సీడ్, శ్రీ సిమెంట్, మహానగర్ గ్యాస్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఆయిల్ ఇండియా 3-0.7 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు హైజంప్
మార్కెట్ల బాటలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం బీఎస్ఈలో 3 శాతం చొప్పు జంప్చేశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1757 లాభపడగా.. 457 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.