గత రెండు రోజులుగా అమ్మకాల షాక్కు లోనవుతున్న షుగర్ కౌంటర్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో వరుసగా మూడో రోజు షుగర్ షేర్లకు నష్టాల సెగ తగులుతోంది. పలు షుగర్ కంపెనీల కౌంటర్లలో అమ్మేవాళ్లేగానీ కొనుగోలుదారులు కరవుకావడంతో 10 శాతం, 5 శాతం చొప్పున డౌన్సర్క్యూట్లను తాకుతున్నాయి. కాగా.. చక్కెర మిల్లులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ధరలను 25 శాతం పెంచడంతో గత వారం తొలి రెండు రోజుల్లో షుగర్ కంపెనీల షేర్లు రెండు రోజులపాటు భారీ లాభాలతో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే.
నేలచూపులతో..
ప్రస్తుతం బీఎస్ఈలో పలు షుగర్ షేర్లు 10 శాతం, 5 శాతం చొప్పున డౌన్ సర్క్యూట్లను తాకాయి.ఈ జాబితాలో పలు కంపెనీల షేర్లు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం బజాజ్ హిందుస్తాన్ 10 శాతం పతనమై రూ. 9.38ను తాకాగా, రాజ్శ్రీ సైతం 10 శాతం కుప్పకూలి రూ. 26.5ను తాకింది. ఈ బాటలో కేఎం షుగర్ 10 శాతం పడిపోయి రూ. 9.87కు చేరగా.. ఉగర్ షుగర్ 5 శాతం నీరసించి రూ. 14.7ను తాకంది. శక్తి షుగర్స్ 5 శాతం పతనమై రూ. 15.5కు చేరగా, శ్రీ రేణుకా 5 శాతం నష్టపోయి రూ. 13.3 వద్ద కదులుతోంది. ఈ కౌంటర్లలో అమ్మకందారులే తప్ప కొనేవాళ్లు కరవుకావడం ప్రస్తావించదగ్గ అంశం!!
జాబితా ఇంకా ఉంది
ఇతర షుగర్ కౌంటర్లలో బీఎస్ఈలో ఆంధ్రా షుగర్ 6.3 శాతం పడిపోయి రూ. 351ను తాకాగా.. మవానా 6 శాతం పతనమై రూ. 55కు చేరింది. బలరామ్పూర్ 3.5 శాతం తిరోగమించి రూ. 76 వద్ద, ఈఐడీ ప్యారీ 3 శాతం బలహీనపడి రూ. 213 వద్ద కదులుతున్నాయి. ఇక బన్నారీ అమ్మన్ 5.3 శాతం కోల్పొయి రూ. 1514 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా ద్వారికేష్ షుగర్ 8 శాతం పడిపోయి రూ. 23 వద్ద, దాల్మియా భారత్ షుగర్ 8.5 శాతం తిరోగమించి రూ. 75 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఉత్తమ్ షుగర్ 7.2 శాతం క్షీణించి రూ. 104కు చేరగా... అవధ్ షుగర్ 7 శాతం కోల్పోయి రూ. 467ను తాకింది. ధంపూర్ షుగర్స్ 4 శాతం తిరోగమించి రూ. 127 వద్ద కదులుతోంది.